TEJASVI ASTITVA
MULTI-LINGUAL MULTI-DISCIPLINARY RESEARCH JOURNAL
ISSN NO. 2581-9070 ONLINE

“సాహిత్యంలో మానవత్వం” :Dr. V. S. Kamalakar

Main theme: “సాహిత్యంలో మానవతా విలువలు”
Sub theme: “సాహిత్యంలో మానవత్వం”
From
Dr. V. S. Kamalakar
Lecturer in Hindi
Government College for Woman
Srikakulam 532001
Cell No’ 9441267061

మున్నుడి :- ‘సాహిత్యం’ ‘మానవత’ ఈ రెండూ సంస్కారయుతమైన సాంఘిక మానవ జీవితమనే నాణానికి బొమ్మ బొరుసులవంటివి అనడం అతిశయోక్తి కాదేమో. అలాగే ఈ రెండింటిలో ఏ ఒక్కటి లోపించినా ఆ సమాజానికి ఏ మాత్రం విలువ ఉండదనడం కూడా అంతే సహజం. అందువల్ల ‘సాహిత్య మానవతల’ సంబంధం దేహాత్మల వంటిదనడం సత్యదూరం కాదు. అందమైన ప్రకృతి ఒడిలో కళ్ళు తెరచిన తరవాత మానవుడు తన ఉనికిని గుర్తించిన క్షణాన్నే మానవునిలో జిజ్ఞాస కూడా కళ్ళు విప్పార్చింది. కళ్ళు విప్పార్చిన జిజ్ఞాస కంఠం నుండి కాలగమనంలో అర్ధవంతమైన పదాలతో కూడిన భాష, దాని వేలి కొసల నుండి అందమైన అక్షరాలతో కూడిన సాహిత్యం క్రమంగా జాలువారాయి. మానవ జీవితంలోకి భాష, అక్షరాలు అడుగు పెట్టడంతోనే పాశవిక-సామూహిక జీవితంలో ఒక విప్లవాత్మకమైన మార్పు సంభవించి, సామూహిక జీవనం సాంఘిక జీవనంగా మారిపోయింది. భాష, అక్షరాల సమ్మేళనంతో సాక్షాత్కరించిన సాహిత్యం మానవ జీవితానికి కొత్త నిర్వచనాన్నిచ్చి దాని గమనాన్నే మార్చేసింది. అందువల్ల మానవుడిలో నిబిడీకృతమై ఉన్న మానవతను సాహిత్యమే ఆవిష్కృతం చేసిందనడం నూటికి నూరుపాళ్ళు నిజం. విద్వన్మణులెంతమందో ఈ సాహిత్యాన్ని అనేక విధాలుగా నిర్వచించారు. కొంత మంది దీనిని జ్ఞానధనాగారంగా భావిస్తే, మరి కొంత మంది దీనిని మానవ జాతికి మేలు చేసే అక్షరబద్ధమైన కరదీపికగా వర్ణించారు. సాహిత్యోత్కృష్టతను వివరిస్తూ మరొకరు దీనిని నాగరిక, అనాగరిక జాతులను వేరు చేసే సన్నని రేఖ అన్నారు. ప్రజల మానసిక స్వస్థతను కాంక్షించేవారు బాధాతప్త హృదయాలకు సాహిత్యం ఒక దివ్యమైన లేపనంవంటిదన్నారు. అందువల్ల సాహిత్యం మానవ జాతికి మేరుపర్వతమంత మేలు చేసేదనడం అతిశయోక్తి కాదేమో!

మానవత్వమంటే? :- ఈ అనంతమైన సృష్టిలో చైతన్య తత్వం పశుత్వం, రాక్షసత్వం, మానవత్వం, దైవత్వం అనే నాలుగు రూపాలలో మనకు దర్శనమిస్తుంది. ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవుణ్ణి మినహాయిస్తే మిగిలిన సమస్త ప్రాణికోటిని మనం పశుత్వమనే ఖాతాలో వేసేయవచ్చు, ఎందుచేతనంటే మిగిలిన మూడు తత్వాలు మానవ రూపంలోనే మనకు కనిపిస్తూ ఉంటాయి; అయితే అప్పుడప్పుడు ఇప్పటికి కూడా మానవులలో కొంత మంది తాము పశుస్థితి నుండే వచ్చామని మనకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు. అందువల్ల “మనిషిలో సహజంగా వ్యక్తంకాదగిన, ఆచరణయోగ్యమైన గుణసముదాయాన్నే మానవత్వం”మని నిర్వచించవచ్చు. వ్యక్తిగత స్థాయిలో మానవత్వం జీవితానికి పునాది, సాంఘిక స్థాయిలో శీలసంపద, జాతీయ స్థాయిలో అది జాతి సంస్కారం అని చెప్పవచ్చు. మానవత్వాన్ని మహోన్నతంగా తమ జీవితాలలో ఆవిష్కరించిన మహనీయులకు పుట్టినిల్లు ఈ భరత భూమి. మన పురాణాల అనంతాబ్ది లోతుల్లోకి వెళ్ళి చూసినట్లైతే మనకు ఈ వైవశ్వత మన్వంతరారంభం నుండి నేటి అర్వాచీన యుగం వరకు మానవత్వానికి నిలువెత్తు నీరాజనాలెత్తిన మహనీయులు ఎంతో మంది దర్శనమిస్తారు. బలి చక్రవర్తి మొదలుకుని ప్రజాశ్రేయస్సు కొరకే ‘పతంజలి’ సంస్థను స్థాపించిన బాలకృష్ణ వరకు ఉన్న వారంతా మూర్తీభవించిన మానవత్వానికి ప్రతిరూపాలు కాదా? సారవంతమైన సహృదయ క్షేత్రంలో నాటబడిన సహజీవనపు విత్తులు మానవత్వపు మొలకలుగా అంకురించినప్పుడు, దానిని సౌహార్ద్రజలాలతో తడిపి మహావృక్షంగా పెరిగే వరకు కాచి కాపాడవలసిన బాధ్యతమనదే కదా. ఎందుకంటే ఆ మహావృక్షపు ఫలాల భోక్తలం మనం, మన వారసులే కదా.

సాహిత్యంలో మానవత్వం : – ప్రతీ భాషావాఞ్మయ చరిత్రలోనూ మనకు కొన్ని యుగాలు దర్శనమిస్తాయి, అయితే మానవీయ దృక్పథమున్న ప్రతీ రచయిత యుగ పరిస్థితులకు పూర్తిగా కట్టుబడిపోకుండా తన రచనలో తప్పక మానవత్వాన్ని పోషిస్తూనే ఉన్నాడు. సమకాలీన సమాజంలోని అమానుషత్వాన్ని పరిహరించడానికి ప్రతీ యుగంలోనూ నిరంతర కృషి సాహితీ స్రష్టల ద్వారా జరుగుతూనే ఉంది; అది సుమదళాల సున్నితత్వాన్ని మరపించే పద్యరచనైనా కావచ్చు లేక ఖడ్గధారలను మరపించే గద్యరచనైనా కావచ్చు. వేమన, సుమతీ శతకాలు, ఆంధ్రీకరింపబడిన భర్తృహరి సుభాషితాలు మొదలుకుని అభ్యుదయ సాహిత్యం వరకు అన్ని శైలులలోనూ మానవత్వం మనకు సాకారమౌతూనే కనిపిస్తుంది. మన ఆచరణకు అద్దం పట్టేది మన ఆత్మసాక్షే కదా, అలాంటప్పుడు దానిలో పరిశుద్ధత లోపిస్తే అది మనల్ని ప్రశ్నించకుండా ఉంటుందా? అందుకే ‘చిత్తశుద్ధి లేని శివపూజలేల’ అని ప్రశ్నించే చిన్ని పద్యం మొదలుకుని ‘బాధాసర్ప ద్రష్టులను ఆదుకోవడానికి తరలి వస్తున్న జగన్నాధ రధచక్రాల’ వర్ణన వరకు మనకు అంతటా మనలో ఉండవలసిన గుణసంపద ఆవశ్యకత కనిపిస్తూనే ఉంది. ఒకచోట ‘పూర్ణమ్మ’ కార్చిన కన్నీటి బిందువులతో నాటి సాంఘిక అమానుషత్వపు సజీవ చిత్రం చిత్రించబడితే, మరొకచోట ‘స్వంత లాభం కొంత మానుకు, పొరుగు వాడికి తోడు పడవోయ్’ అంటూ కవి కలం మానవత్వాన్ని ఆవిష్కరించింది. అలాగే కన్యాశుల్కం నాటకంలో ‘నేను యాంటీ నాచ్’ను అంటూ మానవత్వపు ముసుగులో అమానుషత్వపు చురకత్తి పట్టిన గిరీశంలో నాటి సమాజపు ఆషాఢభూతి మనస్తత్వం స్పష్టంగా వ్యక్తమైతే, అదే దృశ్యకావ్యంలో మధురవాణి వేసిన ప్రశ్న అమానుషత్వపు పరాకాష్టను చూపించడమే కాదు, మానవత్వపు సంలేపనం కోసం పరితపించే స్త్రీ హృదయాన్ని సజీవంగా ఆవిష్కరిస్తుంది; మధురవాణి గిరీశంతో ఇలా అంటుంది “సానిదానికి మాత్రం నీతి ఉండదా ఏమిటి?”. మానవత్వం ఏ ఒక్క కులానికో, జాతికో పరిమితం కాదని మధురవాణి చెప్పకనే చెప్పింది. అయితే అందరూ క్జ్ఞప్తియందుంచుకోవలసిన విషయమేమంటే మానవత్వ పోషణలోనే సమాజ భవిత నిక్షిప్తమై ఉంది.
భారతీయ సంస్కృతికి పట్టుకొమ్మ అద్వితీయమైన పరమత సహనమంటే అతిశయోక్తి కాదు. భారతీయ చరిత్రలోని గత వేయి సంవత్సరాలను తరచి చూస్తే ఏనాడూ మనం మనకుగా ఏ దేశంపైకి దండేత్తి పోయిన జాడలు కనిపించవు; కాకపోతే జరిగిన యుద్ధాలన్నీ ఆత్మరక్షణ, వేదధర్మ పరిరక్షణల కోసం జరిగినవేనని అర్ధమౌతుంది. అసలైన మానవత్వాన్ని దర్శించాలంటే మతసహనానికిమించినదేది ఉంటుంది? విశ్వ వ్యాప్తంగా ఉగ్రవాదం ఉగ్రతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సర్వ మతాలకు సురక్షితమైన ప్రదేశం యోగభూమి అయిన భారతావని కాక మరొక ప్రదేశం ఏది ఉంటుంది? అందువల్ల భారతీయులను మనుషులు అనడం కంటే ‘మనీషులు’ అనడమే సరియైన సంబోధన. దైవార్చనకైనా త్రుంచబడే పూలను చూసి కారుణ్యంతో కన్నీటిని జాలువార్చిన కరుణశ్రీ కలానికి సార్ధక వారసులైన శాంతిశ్రీగారు భారతీయుల పరమతసహనాన్ని, మానవత్వాన్ని గురించి అద్వితీయమైన నిర్వచనమిస్తూ ఒక సీసపద్యంలో ఇలా అన్నారు –
ఏ దేవునైన పూజించుము శ్రద్ధగా ఇతర దేవుళ్ళ దూషించబోకు
ఏ మతంబైనను నీమంబుతో నుండు అన్యమతం బతి హైన్య మనకు
ఏ దేశమైన వసించుము మైత్రితో పర దేశమున దుయ్యబట్ట బోకు
ఏ జాతియైన ప్రేమించు సంప్రీతిగా వేరు జాతిపయి ఆవేశపడకు
అందరు సమానమని యెంచి ఆదరించు
గౌరవించు గావించు నిష్కామ సేవ
సత్ప్రవర్తన త్యాగమ్ము క్షమ అహింస
మానవత్వంబు నీకున్న మనిషి వవుదు!
మలి పలుకు : – ‘సాహిత్యంలో మానవత్వం’ అన్న విషయాన్ని సంక్షిప్తంగా విశ్లేషించడానికి ప్రయత్నించడమంటే పాల కుండలో పసిఫిక్ మహాసముద్రాన్ని నింపడానికి పూనుకున్నట్లే. అయితే సాహిత్య, మానవతల సంబంధం పూలకు, పరిమళానికున్న సంబంధంలాంటిదని మాత్రం మరచిపోకూడదు. మానవత్వ ప్రస్తావన లేని సాహిత్యం అనూహ్యం. సాహిత్యం అజరామరంగా పరిఢవిల్లాలంటే తన అక్షరాలలో మానవతా సుధాబిందువుల్ని పూర్తిగా నింపుకోవాలి. ప్రపంచ వేదికపైనుండి అణుబాంబులు, ఉగ్రవాదం, మతవిద్వేషంవంటివి తొలగింపబడిన నాడే సాహితీ సింహాసనంపై మానవతకు నిజమైన పట్టాభిషేకం సాధ్యమౌతుంది, ఆ రోజుకోసం మనమంతా కొండంత ఆశతో ఎదురు చూద్దాం……

– – – సమాప్తం – – –

CLOSE
CLOSE